ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికీ ఉచితంగా మాస్క్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మాస్క్ల వల్ల కొంత రక్షణ లభిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వీటిని పంపిణీచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు 32,349 మందిని వైద్యాధికారులకు రిఫర్చేశారు. వారిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని మెడికల్ ఆఫీసర్లు నిర్ధారించారు. అయితే, మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు కోవిడ్ 19 కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల పరీక్షలకు సిద్ధమవుతోంది వైద్య శాఖ. వైరస్ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వెల్లడించారు. కోవిడ్ 19 వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు చెప్పారు. హైరిస్కు ఉన్న వారిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. వృద్ధులు, మధుమేహం, బీపీ ఇతరత్రా వ్యాధులతో బాధపడే వాళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. అలాగే నమోదవుతున్న కేసులు, వ్యాప్తిచెందడానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జోన్లను, క్లస్టర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న సీఎం స్పష్టం చేశారు. ఎక్కడా కూడా జనం గమిగూడకుండా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa