రక్తంలో ఎన్నో రకాల గ్రూప్లు ఉన్న సంగతి తెలిసిందే. ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు తప్పకుండా వారి గ్రూప్ తెలుసుకుని అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కించాల్సి వస్తోంది. అలాగే, అన్ని గ్రూప్లకు సరిపోయే రక్తం గల వ్యక్తులు కూడా అంత సులభంగా లభించరు. ముఖ్యంగా రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత కష్టం. ఈ నేపథ్యంలో జపాన్కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల తొకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్లో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలను, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్లెట్స్ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వీటిలో ఆరు ప్రాణాలతో ఉండగా నాలుగు చనిపోయాయి.కుందేళ్ల ప్రాణం నిలిపిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు సైతం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడం కోసం రోడ్, ఎయిర్ అంబులెన్స్లలో O -ve (ఒ-నెగటివ్) రక్తాన్ని తీసుకెళ్తున్నారు. ఈ రక్తం అన్ని గ్రూప్లకు సరిపోతుంది. దీంతో ఈ రక్తాన్ని యూనివర్శల్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. అయితే, ఈ గ్రూపు రక్తం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో డిమాండుకు తగిన సప్లై లేక పోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కృత్రిమ రక్తం తప్పకుండా మేలు చేకూర్చనుందని భావిస్తున్నారు. దాతల రక్తంలోని ప్లేట్లెట్స్ను అటూ ఇటూ కదపడం ద్వారా కేవలం 4 రోజులు మాత్రమే నిలవ ఉంచగలం. అలాగే, రక్తాన్ని తక్కువ ఉష్ణోగ్రతల్లో నిలువ చేసినా కూడా 20 రోజుల్లో దాని స్వభావం మారిపోతుంది. అయితే, శాస్త్రవేత్తలు రూపొందించిన కృత్రిమ రక్తం ఏడాదిపాటు నిలువ ఉంటుందని తెలుపుతున్నారు. ఈ రక్తాన్ని ఎక్కించిన తర్వాత కుందేళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రక్తం మనుషులపై కూడా సక్రమంగా పనిచేస్తే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు నిలుస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa