దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్లో తబ్లీఘీ జమాత్ వ్యవహారం బయటికొచ్చాక దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసుల మూలాలు ఢిలీల్లోనే ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రేపు అన్ని రాష్ట్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సీఎంలతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఇష్యూపైనే చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ పొడిగించాలా? వద్దా? అనే దానిపైనా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకునే అవకాశముంది. కరోనా నివారణ కోసం ఇప్పటి రాష్ట్రాల ఏ ఏ చర్యలు చేపట్టాయని.. ఎంత వరకు సత్ఫలితాలు వస్తున్నాయన్న వివరాలను కూడా తెలుసుకోనున్నారు.కరోనా కట్టడికి కేంద్రం వైపు నుంచి కీలక సూచనలు చేస్తూనే... ఆయా రాష్ట్రాల నుంచి సలహాలు స్వీకరించనున్నారు ప్రధాని మోదీ. సీఎంతో మోదీ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది రెండోసారి. కరోనాపై ఇప్పటికే మార్చి 20న సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతోనే ఆయన మాట్లాడారు. రేపు మాత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. గురువారం ముఖ్యమంత్రులందరితోనూ వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.