ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్ డౌన్ సమయంలో అందుబాటులో ఉండేవి ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 25, 2020, 01:10 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. 21 రోజులు ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటికి వెళ్లకూడదన్నారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు. లాక్ డౌన్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్ కానున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఏం అందుబాటులో ఉంటాయి, ఏం అందుబాటులో ఉండవో అన్న ఆందోళనతో ప్రజలు ఉన్నారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సర్కార్ తెలిపింది. ఎటువంటి పని లేకుండా రోడ్డు మీదికి వస్తే విపత్తు సహాయచట్టంలోని సెక్షన్లు 51 నుంచి 60 కింద 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు.
ప్రజలకు అందుబాటులో ఉండనున్నవి ఇవే
నిత్యావసరాలు
- కూరగాయలు,పండ్లు,పాల డెయిరీలు,మాంసం షాపులు,బియ్యం షాపులు, డ్రింకింగ్ వాటర్ సప్లై షాపులు,ఆహార దినుసుల షాపులు తెరిచి ఉంటాయి.
- ప్రజలు షాపుల వద్దకు వెళ్లకుండా వారి వద్దకే వెళ్లై సప్లై చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
వైద్య సేవలు
- ఆస్పత్రులు,మెడికల్ షాపులు,నర్సింగ్ హోంలు,ల్యాబ్ లు,క్లినిక్ లు తెరిచే ఉంటాయి. వైద్యులు,పారామెడికల్ సిబ్బందికి అనుమతి. పశు వైద్యశాలలు తెరిచే ఉంటాయి.
- నిత్యావసరాల సరఫరా
- ఆహారం,మందులు,ఈ కామర్స్ ద్వారా వైద్య ఉపకరణాలు. వీటిని తయారు చేసే వారికి అనుమతి.
ఆర్ధిక సేవలు
- బ్యాంకులు,ఏటీఎంలు,బీమా కార్యాలయాలు తెరిచి ఉంటాయి. బ్యాంకులలోకి అవసరమైతే తప్ప ఎవరూ వెళ్లకూడదు. ఆన్ లైన్ లో బ్యాంకు సౌకర్యాలన్ని అందుబాటులో ఉంటాయి.
మీడియా
- ప్రింట్,ఎలక్ట్రానిక్ ఆఫీసులు తెరిచి ఉంటాయి. వారి వాహానాలకు కూడా అనుమతి ఉంటుంది. వారి విధులకు ఎవరూ ఆటంకాలు కలిగించవద్దు.
కమ్యూనికేషన్లు
- టెలికాం,ఇంటర్నెట్ సేవలు,కేబుల్,బ్రాడ్ కాస్టింగ్,అత్యవసరమైన ఐటీ ఆధారిత సేవలు అందుబాటులో ఉంటాయి.వీటిలో వర్క్ ఫ్రం హోం నుంచి కూడా కొన్ని పని చేస్తాయి.
విద్యుత్
- విద్యుదుత్పత్తి,సరఫరా పంపిణీ,శీతలీకరణ సేవలు,వేర్ హౌసింగ్ సేవలు,సేవల సిబ్బంది అందుబాటులో ఉంటారు.
పెట్రో ఉత్పత్తులు
- పెట్రోల్ బంకులు,వంట గ్యాస్,గ్యాస్ రిటైల్ స్టోరేజి షాపులు అందుబాటులో ఉంటాయి.
అత్యవసర సేవలు
- రక్షణ,సాయుధ,పోలీసు సిబ్బంది,విపత్తు సహాయ సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది,జిల్లా ట్రెజరీలు,తాగునీటి సరఫరా,పారిశుద్ధ్య సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది,అత్యవసర సేవలు,నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వారు అందుబాటులో ఉంటారు.
లాడ్జిలు
- లాక్ డౌన్ వల్ల చిక్కు బడితే విశ్రాంతి నిమిత్తం బస చేసే హోటల్స్,హోం స్టే,లాడ్జిలు,టూరిస్టులు ఉండే హోటల్స్, మోటార్ సిబ్బంది వాడే మోటెల్స్ కు మినహాయింపు.
ఎవరైనా మరణిస్తే
- ఎవరి ఇంట్లోనైనా వ్యక్తి మరణిస్తే 20 మందికి మించి ఉండరాదు.
- అంత్యక్రియల నిమిత్తం ఎలాంటి అవసరాన్నైనా ఆస్పత్రులు,ఇతర సంబంధ విభాగాల నుంచి పొందవచ్చు. తెలంగాణలో డయల్ 100కి కాల్ చేయవచ్చు.
శిక్షలు
-లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే 2 సంవత్సరాల జైలు.
- తప్పుడు సమాచారమిచ్చి ఉల్లంఘనలకు పాల్పడితే ఏడాది జైలు.
- నగదు,సరుకులను నిల్వచేస్తే 2 సంవత్సరాల జైలు.
- ఉత్తుత్తి వ్యాఖ్యలు,ప్రకటనలతో ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తే 1 సంవత్సరం జైలు.
- ఎటువంటి పని లేకుండా రోడ్డు మీదికి వస్తే విపత్తు సహాయచట్టంలోని సెక్షన్లు 51 నుంచి 60 కింద 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు.
ఉద్యోగుల విషయంలో ప్రైవేటు యాజమాన్యాలు మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని ప్రధాని మోదీ గతంలోనే సూచించారు. ఉద్యోగుల వేతనాలన్ని సకాలంలో అందజేయాలన్నారు. వీలున్న అందరికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలన్నారు. ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయినా జీతాలు చెల్లించాలని,మానవతా ధృక్పథంతో అంతా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ సర్కార్ అవసరమైతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలకు కూడా వెనుకాడమని హెచ్చరించింది. ఏపీ సర్కార్ కూడా కఠిన చర్యలకు ఆదేశించింది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. రోడ్లపైకి ఎక్కితే పోలీసులు లాఠీఛార్జీ చేస్తున్నారు. ఈ 21 రోజులు ప్రజలంతా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa