హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లో బెర్తే లక్ష్యంగా గురువారం శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై కూడా మరోసారి అలాంటి ప్రదర్శనే కనబర్చి సెమీస్కు అర్హత సాధించాలని భావిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిమ్యాచ్లో ఘోరపరాజయం పాలైన లంకకు ఈ మ్యాచ్ చావోరేవోలాగా మారింది. సెమీస్పోరులో నిలవాలంటే ఈ మ్యాచ్లో లంక కచ్చితంగా నెగ్గాలనే ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. 2007-14 మధ్యకాలంలో ఐదు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఆడిన శ్రీలంక ఇప్పుడు ఆ స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్లోనూ కోహ్లీసేన ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో లంక పోరు నామమాత్రమే
2015 వన్డే ప్రపంచకప్ తర్వాత దిగ్గజాలు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర జట్టు నుంచి వీడ్కోలు తీసుకోవడంతో ఆ స్ధాయి ఆటగాళ్లు ఆ జట్టుని ఇంకా భర్తీ చేయలేదు. దీంతో ఈ టోర్నీలో లంక పోరు నామమాత్రంగానే ఉండనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిపోరులో 96 పరుగులతో చిత్తుగా ఓడింది. దీంతో నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా విజయం సాధించాల్సిందే. అయితే ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే ఏ ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. గాయంతో తొలి మ్యాచ్కు దూరమైన కెప్టెన్ మాథ్యూస్ పూర్తిగా కోలుకున్నాడు.