కరోనా వైరస్ నిరోధం, ఇళ్లపట్టాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా భయంలో ఉన్న ప్రజలను దోపిడీ చేసేందుకు వ్యాపారులు సరుకుల ధరలు పెంచి అమ్మితే వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కరోనా వైరస్ వస్తే ఇక మరణమే అనే భయం వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే, తప్పనిసరిగా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని సూచించారు. ‘ప్రజలను ఆందోళనకు గురిచేయడం ద్వారా సరుకులు కొరత వస్తుందన్న ఆందోళనా అవసరం లేదు. దుకాణాలు అందుబాటులో ఉంటాయి. వాటిని మూసివేయడం కూడా ఉండదు. నిత్యావసర వస్తువులకు కొరత ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ విషయాలను ప్రజలకు చెప్పాలి. తప్పుడు సమాచారం ఇచ్చి, ఆందోళనకు గురిచేసి... తద్వారా లాభపడాలని, సరుకుల రేట్లను పెంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిత్యావసర వస్తువుల ధరలపై పర్యవేక్షణ చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువులపై దృష్టిపెట్టాలి. కరోనాను సాకుగా తీసుకుని ధరలు పెంచితే కఠిన చర్యలు.’ అని సీఎం జగన్ హెచ్చరించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఏపీలో కేవలం ముగ్గురికి మాత్రమే కరోనా పాజిటివ్ ఉందన్నారు. వారు కూడా విదేశాల నుంచి వచ్చారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూసినా 80.9శాతం మంది కరోనా వైరస్ కేసులకు ఇళ్లల్లోనే ఉంటూ.. వైద్యం తీసుకోవడం ద్వారా నయం అయ్యిందని జగన్ అన్నారు. కరోనా అంటూ ప్రజలు కలత చెందాల్సిన అవసరం లేదని, మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. దాదాపుగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టేనని జగన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa