ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 18 రోజులు వైన్ షాపులు బంద్...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2020, 04:52 PM

ఏపిలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధానికి అందరూ మంచి మార్కులే వేశారు. మద్యపాన నిషేదం అమలులో భాగంగా ప్రభుత్వ వైన్ షాపులను ఏర్పాటు చేయడమే కాకుండా మద్యం అమ్మే వేళలను, షాపులను సైతం ప్రభుత్వం కుదించింది. మద్యం బ్రాండులు కూడా బాగా తగ్గించింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లిక్కర్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 18 రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. అయితే మూడు దఫాలుగా ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 660 జెడ్‌పిటీసి, 9,639 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా పంచాయతీలకు మరో దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో మున్సిపాలీటీలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే 18 రోజుల పాటు మద్యం అమ్మకాలు ఉండవు. రాష్టంలో ప్రస్తుతం 4,200 లిక్కర్ షాపులు, 800కు పైగా బార్‌లూ ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.17,500 కోట్ల ఆదాయం వస్తోంది. వైన్ షాపులు తగ్గాలి, ఆదాయం మాత్రం తగ్గకూడదు, ఇదే ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు పెట్టుకున్న టార్గెట్. ఇందుకు తగ్గట్టుగా పాలసీ రూపొందించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే 3,500 షాపులను అధికారికంగా నిర్వహిస్తోంది. మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేసింది. ఇక ధరలు చూసినట్లైతే.. ఏపీలో క్వార్టర్ సీసా గతంలో రూ.100 అమ్ముడు అయింది. కానీ పెరిగిన ధరల కారణంగా క్వార్టర్ రూ.160 పెట్టి విక్రయిస్తున్నారు. రాయల్ స్టాగ్ క్వార్టర్ గతంలో రూ.150 కాగా ఇప్పుడు రూ. 170కి చేరింది. గతంలో రూ. 100కు అమ్ముడైన బీరును రూ. 160కి విక్రయిస్తున్నారు. ఏపీలో 2018-19లో 12.96 శాతం వృద్ధితో రూ.17.340 కోట్ల ఆదాయం వచ్చింది. 2018-19లో వచ్చిన ఆదాయం రూ. 6,222 కోట్లు కాగా 2019-20లో ఎక్సైజ్ ఆదాయం 8,518 కోట్లు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఏపీ రాష్ట్ర ఆదాయం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అయితే కేవలం రూ.20 వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మకాల వల్లే వస్తోంది. ఒక్క జనవరి 1వ తేది వేడుకల్లోనే ఏపీలో దాదాపు 100 కోట్ల విలువైన మద్యం తాగారని ఎక్సైజు శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 18 రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేయడం వల్ల ఏపీకి భారీగా నష్టం వాటిల్లనుంది. వైన్ షాపుల వల్ల వచ్చే ఆదాయం తగ్గనుంది. రోజుకు దాదాపుగా 23 కోట్ల ఆదాయం వైన్ షాపుల వల్లే రానుంది. అంటే నెలకు 709 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 18 రోజులు ఏపీలో వైన్ షాపులు మూసివేయడం వల్ల 414 కోట్ల రూపాయలు ఆదాయం రాకుండా పోనుంది. ఇదే కాకుండా వైన్ షాపులను నమ్ముకుని వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్న వారు, చిన్న చిన్న హోటళ్లలో కూడా వ్యాపారం జరగక ఆర్థిక నష్టం వాటిల్లనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa