కర్నూలులో 2017లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి రిఫర్ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్ ప్రీతి కుటుంబ సభ్యులకు వెల్లడించారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మంగళవారం కర్నూలులో సీఎం వైఎస్ జగన్ను కలుసుకుని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని కర్నూల్ లో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి ఆయన్ను కలిశారు. ఖచ్చితంగా ప్రీతి కేసు సీబీఐకి ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ స్పష్టం చేశారు. న్యాయం జరుగుతుందని ప్రీతి తల్లికి జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబాన్ని కూడ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయమై మరోసారి మాట్లాడుతానని.. ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.