లండన్: అతను పాకిస్థాన్ టీమ్కు వీరాభిమాని. ఆ టీమ్ ప్రపంచంలో ఎక్కడ ఆడినా.. స్టాండ్స్లో అతను వాలిపోతాడు. అలాంటి వీరాభిమాని కచ్చితంగా ఇండియన్ టీమ్ను ఓ శత్రువుగానే చూస్తాడు. కానీ మహ్మద్ బషీర్ అలియాస్ చికాగో చాచా మాత్రం అలా కాదు. చాంపియన్స్ ట్రోఫీలో ఇండోపాక్ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్ అని అడిగితే.. కచ్చితంగా ఇండియానే అని అతను చెప్పేశాడు. అంతేకాదు.. తన మద్దతు కూడా ఈసారి టీమిండియాకే అని తేల్చేశాడు. ఎప్పటి నుంచో పాక్ టీమ్కు మద్దతు తెలిపినా.. అతనికి ఎమ్మెస్ ధోనీ అంటే చాలా ఇష్టం. పాక్ టీమ్ కంటే ఎక్కువగా అతను ధోనీకే అభిమాని అంటే ఆశ్చర్యం లేదు. మొత్తానికి ఇన్నాళ్లకు అతనికి ధోనీతో కలిసి ఫొటో దిగే అవకాశం కూడా వచ్చింది.అసలు విరాట్సేనతో పోటీపడే సత్తా పాక్కు ఎక్కడుందని ఈ చికాగో చాచా అంటున్నాడు. అందరూ అనుకున్నట్లుగా ఇండో-పాక్ మ్యాచ్లో పోటీ ఎక్కడుంది? పాక్తో పోలిస్తే ఆటపరంగా భారత్ ఎంతో ముందుంది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియానే గెలుస్తుంది. భారత్లో ధోనీ, కోహ్లీ, యువరాజ్లాంటి పెద్ద స్టార్లు ఉంటే పాక్లో ఎవరున్నారు అని బషీర్ ప్రశ్నిస్తున్నాడు. 2011 వరల్డ్కప్ నుంచి భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ జరిగినా తప్పకుండా హాజరయ్యే చాచా ఈసారి రంజాన్ సందర్భంగా మక్కా వెళ్లాడు. దీంతో ఈ మ్యాచ్ను చూడలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశాడు.