ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రిన్స్‌ ఈజ్‌ బ్యాక్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 30, 2017, 11:41 AM

లండన్‌: అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌కి దూరమయ్యాడు సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌. ఆ తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్‌కి అతడు అనుమానమే అన్న సంకేతాలు అందాయి. అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కి యువరాజ్‌ సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించింది.


గతవారం ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీలో తలపడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్‌ చేరుకుంది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో యువరాజ్‌ ఇక్కడికి రాగానే జ్వరంతో బాధపడ్డాడు. దీంతో మొదటి ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా పాల్గొనలేకపోయాడు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే యువరాజ్‌ కోలుకుంటాడని మేనేజ్‌మెంట్‌ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో యువరాజ్‌ పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించిన బీసీసీఐ ‘ప్రిన్స్‌ ఈజ్‌ బ్యాక్‌’ అన్న క్యాప్షన్‌తో యువీ ఫొటోను జత చేసింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కి ముందు రోహిత్‌ శర్మ, యువరాజ్‌ సింగ్‌ భారత జట్టులో చేరడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో భారత క్రికెట్‌ జట్టు సారథి కోహ్లి మాట్లాడుతూ... ధోనీ, యువరాజ్‌ సింగ్‌తో తమ జట్టు మిడిలార్డర్‌ బలంగా ఉందని తెలిపాడు. టోర్నీలో భాగంగా జూన్‌ 4న భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com