తిరుమల: తిరుమలలో కారీరి యాగం ప్రారంభమైంది. పాపవినాశనం మార్గంలో పార్వేట మండపం వద్ద గల గోగర్భ తీర్థంలో రుత్వికులు శాస్త్రోక్తంగా ఈ వరుణ యాగం ప్రారంభించారు. విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రంతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ వరుణదేవుడి అనుగ్రహం కోసం తితిదే ఈ యాగం నిర్వహిస్తోంది. మహానిష్ణాతులైన పండితులతో గోగర్భ తీర్థం వద్ద వరుణయాగం, శ్రీవరాహస్వామి వారి ఆలయంలో వరుణ జపం, ఆస్థాన మండపంలో విరాటపర్వ పారాయణాన్ని... నాదనీరాజన వేదికపై అమృత వర్షిణి రాగం ఆలాపన కార్యక్రమాలను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.