కర్నూలు జిల్లాకు మహర్ధశపట్టనుంది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమ వాసుల చిరకాల కోరికను సీఎం వైయస్ జగన్ నెరవేర్చారు. ఏపీ జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలును ప్రకటించారు. అంతేకాదు జ్యుడీషియల్ కేంద్రంగా ప్రకటించడంతో అందుకు సంబంధించిన కార్యాలయాల తరలింపునకు శుక్రవారం రాత్రి జగన్ సర్కార్ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దాంతో ఫుల్ జోష్ లో ఉన్నారు సీమ ప్రజలు. తాజాగా మరో కీలక బోర్డు కూడా కర్నూలుకు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ ఆధీనంలో ఉండే కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలుకు తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది 21 జనవరి 2020న న్యూఢిల్లీలో గోదావరి, కృష్ణా నదీజల యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి జలవనరుల శాఖ కీలక అధికారులు పాల్గొన్నారు. నీటి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ జలవనరుల అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని ప్రతిపాదించారు. అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. అయితే ఈ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంతా అభిప్రాయపడ్డారు.
కర్నూలులో కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ విభజనచట్టం పదవ షెడ్యూల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల నిర్వహణ, అభివృద్ధి అంశాలను వివరిస్తుంది. గోదావరి కృష్ణా నదీజల యాజమాన్య మండలి గురించి కీలక అంశాలను పొందుపరిచింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు రాష్ట్ర అవతరణ దినం నుండి అరవైరోజులలో ఏర్పాటు చేయాలని సూచించింది.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంద్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ రెండు బోర్డుల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్రం ఒక అపెక్స్ కౌన్సిల్ ను సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. బోర్డుల నిర్వహణ, కీలక సమస్యల పరిష్కారం, ట్రిబ్యునల్ విచారణలకు పంపడం తదితర అంశాలను ఈ మండలి నిత్యం పర్యవేక్షిస్తుంది.