అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతాపార్టీని శక్తిమంతమైన పార్టీగా తయారు చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ సిద్దార్థ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మోదీ అంటే సుపరిపాలనకు మారు పేరని, మరో పదేళ్లపాటు బీజేపీ దేశ వ్యాప్తంగా అధికార ఢంకా మోగించాలని, దేశం మొత్తం బీజేపీ, మోడీవైపే చూస్తోందన్నారు. గడచిన మూడేళ్లలో ఒక్క అవినీతి కుంభకోణం లేదని, ఇతర పార్టీలు చీలిక పేలికలుగా తయారయ్యాయని, అవినీతి పరుల పాలిట మోదీ అతివీర భయంకరునిగా తయారయ్యారని, మోదీ వంటి సామాన్యుడు ప్రధాని పదవి చేపట్టారంటే అది భారతీయ జనతాపార్టీ ఘనతేనన్నారు. రేపటి నుంచి జూన్ 15 వరకు మోదీ ఫెస్ట పేరుతో ఉత్సవాలు జరగబోతున్నాయి. పార్టీ శ్రేణులంతా పాల్గొని భాజపాను ఇంటింటికీ తీసుకెళ్లాలని, ఆంధ్రప్రదేశ్ను కేంద్రం ఆదుకుంటోందన్నారు.
కొందరు వ్యక్తులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని కార్యర్తలకు సూచించారు. సమ్మేళనంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ నేతలు కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, విష్ణుకుమార్రాజు, మాధవన్ తదితరులు పాల్గొన్నారు.