న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం సుఖోయ్-30 గల్లంతైంది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో అసోంలోని తేజ్పూర్ సమీపంలో ఈ జెట్ విమానం అదృశ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. తేజ్పూర్కు 60 కి.మీ దూరంలో రాడార్ నుంచి సుఖోయ్-30 జెట్ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం అదృశ్యమైన ప్రాంతం చైనా సరిహద్దుకు దగ్గర్లో ఉంది. ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు.రోజువారీ శిక్షణలో భాగంగా ఇద్దరు పైలట్లు సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విమానం క్రాష్ ల్యాండ్ అయి ఉండొచ్చని ఓ ఐఏఎఫ్ అధికారి అన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఇప్పటి వరకు తన దగ్గర ఉన్న మొత్తం 240 సుఖోయ్ విమానాల్లో ఏడింటిని ఇలాగే కోల్పోయింది. ఈ యుద్ధ విమానం నుంచి చివరిసారిగా 11.30 గంటల సమయంలో సిగ్నల్స్ వచ్చాయని, ఆ తరువాత నుంచి విమానం ఆచూకీ లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత నెల రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో కూడా వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ విమానం ఓ గ్రామంలోని ఇంటిపై కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు గ్రామస్థులు గాయపడ్డారు.