ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరం బాంబు దాడితో ఉలిక్కి పడింది. మాంచెస్టర్లో అరియానా గ్రాండే సంగీత కచేరి జరుగుతున్న ప్రాంతంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది మృతి చెందగా...50 మందికి పైగా గాయపడినట్లు బ్రిటన్ పోలీసులు వెల్లడించింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగీత కచేరి ప్రాంతంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా దళాలు సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, ఈ దాడిలో పాప్ సింగర్ అరియానాకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి ప్రకటించారు.