బెంగుళూరు: కర్ణాటక బీజేపీ అధినేత యడ్యూరప్ప ఇడ్లీ వివాదంలో ఇరుక్కున్నారు. దళితులకు పార్టీని దగ్గర చేయాలని భావిస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ దళిత నాయకుల ఇళ్లలో అల్పహార కార్యక్రమాలను ప్లాన్ చేసింది. అయితే దళిత నాయకుల ఇళ్లకు వెళ్లిన యడ్యూరప్ప వారి ఇంటి వంటలు కాకుండా హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకుని తినడం వివాదం రేపింది.దళితులను యడ్యూరప్ప ఇంకా అంటరానివారిగా చూస్తున్నారు కాబట్టే వారి ఇళ్లలో చేసిన అల్పహారాన్ని కాకుండా, రెస్టారెంట్ నుంచి ఆయన బ్రేక్ ఫాస్ట్ తెప్పించుకున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మాండ్యా జిల్లాకు చెందిన డి.వెంకటేశ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల కేఎస్ ఈశ్వరప్ప సహా తదితర దళిత నాయకుల ఇళ్లలో అల్పహారానికి వెళ్లినప్పుడు యడ్యూరప్ప ఇలా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఆరోపణలను ఖండిస్తున్నారు. యడ్యూరప్పకు ఇడ్లీ, వడ అంటే ఇష్టమని, అందుకే ఆయన బయట నుంచి తెప్పించుకున్నారని అన్నారు. దళితుల సంక్షేమం, వారి అభివృద్ది కోసం బీజేపీ పాటుపడుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదన్నారు. తమ చిత్తశుద్దిని శంకించవద్దని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దళితుల ఇళ్లలో యడ్యూరప్ప అల్పహారం తినలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, వారి ఇళ్లల్లో వండిన పులావును కూడా రుచి చూశారని చెప్పుకొచ్చారు. దళిత ఓటు బ్యాంకు కోసమే యడ్యూరప్ప.. ఇలా వారి ఇళ్లలో అల్పహారాలకు వెళ్లే జిమ్మిక్కులు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.