ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాగుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 09:17 AM

రాగి జావ అనగానే కొందరు తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ రాగుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి.


1. క్యాల్షియం... 


ఇతర గింజల్లో వేటిలో లేనంత క్యాల్షియం నిల్వలు రాగుల్లో వుంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకల పుష్టి కోసం కొందరు క్యాల్షియం మాత్రలను వాడుతుంటారు. వాటికి బదులు రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలు పుష్టిగా, వారి ఎముకలు బలంగా వుండాలంటే రాగి జావ ఇస్తుండాలి. 


 2. అధిక బరువును అడ్డుకుంటుంది...
రాగుల్లో కొవ్వు తక్కువ కనుక అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటుంటే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం కాకుండా రాగులు తీసుకుంటుంటే బరువు కంట్రోల్ అవుతుంది. అమినో ఆసిడ్లు వుండటం వల్ల అధిక బరువు వున్నవారు బరువు తగ్గి మామూలు స్థితికి వచ్చే అవకాశం వుంటుంది.


 3. బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది...
అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్, ఫైబర్ వుండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది.


 4. అనీమియాను అడ్డుకుంటుంది...


సహజసిద్ధంగా కావల్సినంత ఇనుము ఇందులో లభ్యమవుతుంది. అనీమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటుంటే మంచి ఫలితం వుంటుంది. విటమిన్ సి స్థాయిలను కూడా ఇది పెంచుతుంది.


 5. చిన్నపిల్లలకు చక్కని ఆహారం...
28 రోజులు నిండిన పిల్లలకు రాగి జావను పెడుతుంటారు. ఈ జావలో పిల్లలకు పోషకాలు అందటం ద్వారా ఆరోగ్యంగా వుంటారు. ఐతే మోతాదుకు మించి రాగి జావను ఇవ్వరాదు. 


 ఈ తీపి రాగి జావను ఎలా తయారు చేయాలో చూద్దాం...


కావలసినవి:
రాగి పిండి రెండు టీ స్పూన్లు, నీళ్లు ఒక కప్పు, పాలు - రెండున్నర కప్పులు, పంచదార- రెండు టేబుల్ స్పూన్లు, బాదం పొడి- రెండు టీ స్పూన్లు, యాలకల పొడి, శొంఠి పొడి అర టీ స్పూన్, కుంకుమపువ్వు చిటికెడు, నెయ్యి లేదా వెన్న ఓ టీ స్పూన్.


 తయారు చేయడం...
సాస్ పాన్లో నెయ్యి వేడి చేసిన తర్వాత రాగి పిండి వేసి ఓ మాదిరి మంటపై వేగించాలి. పిండి రంగు మారి వేగించిన వాసన రాగానే మంట తగ్గించి అందులో నీళ్లు పోయాలి.


 * పిండి వుండలు కట్టకుండా గరిటతో తిప్పుతూ వుండాలి.


 * రాగి పిండి మిశ్రమం చిక్కపడేవరకూ రెండుమూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత పాలు పోసి గరిటెతో తిప్పుతూ వుండలు కట్టకుండా తిప్పుతూ వుండాలి.


* పంచదార, యాలకల పొడి, కుంకుమ పువ్వు, బాదం పొడి వేసి ఓ మాదిరి మంట మీద మిశ్రమం మరికాస్త చిక్కబడేవరకూ ఉడికించాలి.


 * ఈ తీపి రాగి జావను వడగట్టి తాగేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com