ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముందు నుయ్యి.. వెనక గోయ్యిలా ఆ ఎమ్మెల్యేల పరిస్థితి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 03:13 PM

ఏపీ సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన అమరావతి ప్రాంతా ఎమ్మెల్యేలకు సంకటంగా మారింది. ముఖ్యంగా వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే ల పరిస్థితి అయితే దయనీయంగా ఉందన్న చర్చ నడుస్తోంది. అందుకు కారణం అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల గ్రామాలన్నీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఉండటమే. ఆ ఇద్దరిలో ఒకరు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఒకరయితే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మరోకరు. రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తూళ్లూరు మండలం తాడికొండ నియోజకవర్గంలోనే ఉంది.


రాజధాని మార్పుపై స్పందిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఎమ్మెల్యే శ్రీదేవి మధనపడుతున్నారట. సీఎం ప్రకటనను వ్యతిరేకిస్తే జగన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని శ్రీదేవి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇటు రైతులను సమర్థించలేక అటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక మీడియాకు దూరంగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మరో ఎమ్మెల్యే ఆర్కే పరిస్థితి కూడ ఇలాగే ఉంది. ఆర్కే ఏకంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పై నే గెలుపోందారు. ప్రస్తుతం ఆర్కే సీఆర్డీఏ చైర్మన్ గా కూడ ఉన్నారు. ఈయన నియోజకవర్గమైన మంగళగిరి కొన్ని గ్రామాలు సైతం రాజధాని పరిధిలో ఉన్నాయి.


దీంతో మూడు రాజధానుల ప్రకటనను స్వాగతించాలో .. వ్యతిరేకించాలో విచిత్ర పరిస్థితిని ఆర్కే ఎదుర్కోంటున్నారు. గతంలో అమరావతిని కాకుండా మంగళగిరిని రాజధాని చేయాలని ఆర్కే డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హాయంలో రాజధాని భూములతో అనేక అంశాలపై ఆర్కే కోర్టుకు వెళ్లారు. అయితే ప్రస్తుతం రాజధాని మార్పుపై స్పందించే పరిస్థితిలో లేరన్నది ఆర్కే సన్నిహితుల వాదన. చివరకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కనబడటం లేదని రైతులు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసిన కూడ శ్రీదేవి, ఆర్కే బయటకు రావడం లేదు. మొత్తానికి మూడు రాజధానులపై జగన్ నిర్ణయం వీరిద్దరికి ముందు నుయ్యి వెనక గోయ్యిలా తయారైంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa