అమరావతి రైతులు ఆందోళన విరమించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అమరావతి రైతుల భూములను అభివృద్ధి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని పేరుతో గతంలో దోపిడీ జరిగిందని, ప్రతిపక్షనేత చంద్రబాబు మాటలకు ఇంకా మోసపోవద్దని రైతులకు సూచించారు. అమరావతి ప్రాంతంలో కొందరు నిరసన తెలియజేస్తుంటే, చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కుమారుడి సంస్థకు 500 ఎకరాల భూములు ఏరకంగా కేటాయిస్తారని బొత్స ప్రశ్నించారు. ఆ భూముల వరకు సీఆర్డీఏ ప్రాంతాన్ని విస్తరించడం దోపిడీ కాదా అని నిలదీశారు. చంద్రబాబు సీఎం అయ్యాక హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసిందన్నారు. పత్రికల్లో వస్తున్నంత తీవ్రంగా అమరావతిలో ఆందోళనలు జరగడం లేదని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ, తాజాగా జి.ఎన్.రావు కమిటీలు ఒకే రకమైన సూచనలు చేశాయన్నారు. తాజాగా టిడ్కో ఇళ్ల నిర్మాణ రివర్స్ టెండర్లలో రూ.150 కోట్ల వరకు ఆదా అయిందన్నారు. ఆధారాలతో సహా గత ప్రభుత్వ అక్రమాలు వెలుగుచూస్తుంటే హైకోర్టు జడ్జితో విచారణ ఎందుకని ప్రశ్నించారు. సీఎం జగన్కు ఒక విజన్ ఉందని దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 28న సీఎం విశాఖ పర్యటన సందర్భంగా రూ.1400 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దీనిలో రూ.వెయ్యికోట్ల పనులు 6 నెలల వ్యవధిలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa