ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిఎస్‌టి బిల్లుకు ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 17, 2017, 03:02 AM

(వెలగపూడి-సూర్య ప్రధాన ప్రతినిధి) : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మంగళవారం ఆమోద ముద్ర వేసింది. అలాగే ప్రజా సేవల చట్ట సవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన వెలగపూడి శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జిఎస్‌టి బిల్లును ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపిన తరువాత బిల్లును ఆమోదించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమ్మతిని వ్యక్తం చేశారు. కాగా రైతుల సమస్యలపై చర్చించాలంటూ ప్రతిపక్ష వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపినప్పటికీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు జిఎస్‌టి బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన దేవినేని నెహ్రూ సహా పలువురు మాజీ శాసనసభ్యుల మృతికి సంతాపం ప్రకటించారు.


సభలో వైకాపా సభ్యుల ఆందోళన...


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభమైన వెంటనే రైతుల సమస్యలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. అయితే వారి విజ్ఞప్తిని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జిఎస్‌టి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వైసీపీ సభ్యుల నినాదాల మధ్యనే యనమల ప్రసంగించారు.


ఉప కలెక్టర్‌గా పీ.వీ సింధు...


ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీ.వీ సింధుకు గ్రూప్‌-1 ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఈ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో సింధు అద్భుతమైన ప్రతిభ చూపిందని కొనియాడారు. దీంతో ఆమెను ఉప కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు క్రీడారంగాన్ని నిర్లక్ష్యం చేశాయని, తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం తరువాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.


సంస్కరణలకు నాంది : ముఖ్యమంత్రి చంద్రబాబు


ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో కేంద్రం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అన్ని రాష్ట్రాలు జిఎస్‌టి బిల్లును ఆమోదిస్తున్నాయని, జిఎస్‌టి విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలుకుతుందని చెప్పారు. ఆర్థిక సంస్కరణల తరువాత జిఎస్‌టి ఒక విప్లవాత్మక సంస్కరణ అని, ఒకే పన్ను విధానం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైసీపీ సభ్యులకు విజ్ఞత, ఆలోచన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరు విచిత్రంగా ఉందన్నారు. ఏ అంశానికి సహకరించాలో, ఎప్పుడు వ్యతిరేకించాలో కూడా ప్రతిపక్షానికి తెలియడంలేదన్నారు. జిఎస్‌టి బిల్లు ఆమోదంపై మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఒకే పన్ను విధానం లక్ష్యం : ఆర్థిక మంత్రి యనమల


ప్రపంచవ్యాప్తంగా జిఎస్‌టి అమలు జరుగుతోందని, జిఎస్‌టి బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పన్నుల విధానంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే కేంద్రం జిఎస్‌టి బిల్లును తీసుకువచ్చిందని, దేశంలో ఒకే పన్ను విధానమే ఈ బిల్లు లక్ష్యమని యనమల చెప్పారు. 


వైకాపా సభ్యుల తీరు సరికాదు : బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు


జిఎస్‌టి బిల్లును దేశవ్యాప్తంగా సమర్థించారని, మన రాష్ట్రం కూడా ఆమోదించాలని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. సభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల తీరు సరికాదని, స్పీకర్‌ స్థానానికి ఎంతో విలువ ఉన్నందున ప్రతి పక్షపార్టీ సభ్యులు గౌరవించాలని సూచించారు.


పన్నుల భారం తగ్గుతుంది : ఎమ్మెల్యే ఆనందరావు


జిఎస్‌టి వల్ల పన్నుల భారం తగ్గే అవకాశం ఉందని, ఆర్థిక వ్యవస్థ సామర్ధ్యం పెంపు కోసం జిఎస్‌టి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ఆనందరావు అభిప్రాయపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com