ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మోడళ్లు విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 50 లక్షల ఫోన్లను విక్రయించినట్లు సంస్థ మంగళవారం వెల్లడించింది. దాదాపు 120 దేశాల్లో ఈ ఫోన్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది. ఎస్8 విడుదల చేశాక చాలా చోట్ల వినియోగదారులు డిస్ప్లే ఎర్ర రంగులో వస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీ వెంటనే స్పందించి సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేసింది. వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో మొబైల్ అమ్మకాల ద్వారా కంపెనీ రెండో త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గత రెండు సంవత్సరాలుగా చైనాలో తన మార్కెట్ను క్రమంగా కోల్పోతున్న శాంసంగ్ అక్కడ మే ఆఖరు లేదా జూన్లో ఈ మోడల్స్ను విడుదల చేసే అవకాశం ఉంది.