హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా తన ముద్దుల కుమార్తె మొట్టమొదటి పుట్టినరోజు ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దేశంలోని నిరుపేదల తల్లులు, చిన్నారుల కోసం ఓ ఫౌండేషన్ ప్రారంభించాడు. ఈ ఫౌండేషన్ను తమ కుమార్తె పుట్టినరోజు ప్రారంభిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.సురేశ్ రైనాతో పాటు అతడి భార్య ప్రియాంక ఇద్దరూ తమ చిన్నారి గ్రేసియా రైనా పుట్టినరోజున ఫౌండేషన్ను ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ ఫౌండేషన్కు గ్రేసియా రైనా ఫౌండేషన్ అని పేరు పెట్టారు. ఈ ఫౌండేషన్ శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లులు, చిన్న పిల్లల్లలో అవగాహన సృష్టిస్తుందని తెలిపారు.
'నాకు, నా భార్యకు ఇది ఎంతో ప్రత్యేకం. మా కుమార్తె పుట్టినరోజున ఈ ఫౌండేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ ఫౌండేషన్కు నా భార్య అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, దీనికి నా మద్దతు కూడా ఉంటుంది' అని రైనా ట్విట్టర్లో పేర్కొన్నాడు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రైనా దంపతులు.. భవిష్యత్ ప్రణాళికలను మీడియాకు వివరించారు.చిన్నపిల్లల తల్లుల సంరక్షణ కోసం తమ సంస్థ పనిచేస్తుందని, వారి ఆరోగ్య, మానసిక, సామాజిక స్థితుల్లో మార్పునకు కృషిచేస్తామని ప్రియాక చౌదరి రైనా తెలిపారు. అందరి సహకారంతో మహిళను ప్రోత్సహించే పరిస్థితులను కల్పించడం, తల్లుల మానసిక, ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు అందించడం, నవజాత శిశువుల ఆరోగ్యపరిరక్షణ తదితర అంశాలకు 'గ్రేసియా రౌనా ఫౌండేషన్' ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పారు.