చంద్రగిరి, మేజర్న్యూస్, : శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 15వ తేది నుంచి 17వ తేది వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీసత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వార్ల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత ఋతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్ధం. కాగా రెండో రోజు ఈ నెల 16వ తేది సాయం్త్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయం్త్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు ఇద్దరు ఒక రోజుకు రూ.516 చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చును. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో కల్యాణోత్సవం, స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తర శతకలశాభిషేకం ఆర్జితసేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.