విశాఖపట్నం,సూర్యప్రతినిధి: భారతీయ రైల్వే బోర్డు ఛైర్మన్ ఎ.కె. మిట్టల్ ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్లో పర్యటిస్తారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక జోన్ను ఇవ్వాలన్న డిమాండ్ నేపథ్యంలో డివిజన్లో ఈ పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. 12న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక సెలూన్లో విశాఖపట్నం చేరుకోనున్న ఆయన 1.30 వరకూ డివిజన్ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం డీఆర్ఎం ఛాంబర్లో 1.45 వరకూ ఎంపీలతో భేటీ కానున్నారు. అనంతరం 2 గంటల వరకూ కార్మిక సంఘాలతో సమావేశమై ఎలక్ట్రికల్ లోకో షెడ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాత్రి 8.30 గంటల సమయంలో రైల్ క్లబ్లో ప్రత్యేక ఆతిథ్యం స్వీకరిస్తారు. 13వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక రైలులో విశాఖ నుంచి బయలుదేరతారు. 11.30 గంటలకు బొర్రా చేరుకుని, అక్కడి స్టేషన్ను సందర్శిస్తారు. 12.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అరకు వెళ్లనున్నట్లు సమాచారం. రాత్రి అరకులోనే ఉండి మర్నాడు ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక రైలులో బయలుదేరి 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకొంటారు. అక్కడి నుంచి రైల్వే క్రీడా మైదానంతో పాటు ఇండోర్ స్టేడియంను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నూతనంగా నిర్మించిన టైప్-5 రైల్వే క్వార్టర్లను ప్రారంభిస్తారు. మర్నాడు ఉదయం 7 గంటలకు విమాన మార్గంలో తిరుగు ప్రయాణం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.