బెంగళూరు: ఓ క్యాబ్ సంస్థలో సాంకేతిక లోపంతో జరిగిన సంఘటన ఆ ప్రయాణికుడిని బిత్తరపోయేలా చేసింది. బెంగళూరు రైల్వేస్టేషన్లో దిగిన బి.ఎస్.ప్రవీణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ను బుక్ చేశారు. రైల్వేస్టేషన్ నుంచి మైసూర్రోడ్డులో ఉన్న శాటిలైట్ బస్స్టాప్ వరకు ఆయన వెళ్లాలి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 5కి.మీ మాత్రమే. శాటిలైట్ బస్టాప్ వద్ద ప్రవీణ్ దిగిన తరువాత క్యాబ్ డ్రైవర్ రూ.5,325 ఛార్జి అయిందని చెప్పడంతో ప్రవీణ్కు దిమ్మతిరిగిపోయింది. కేవలం 5కి.మీల దూరానికి అంత బిల్లేంటని డ్రైవర్ను ఆయన ప్రశ్నించారు. ఇప్పటి ఛార్జి రూ.103 అని.. మిగతాదంతా ఇంతకు ముందు ఉబర్ వాడినప్పుడు అయిన పెండింగ్ బిల్లు అని డ్రైవర్ చెప్పాడు.దీనికి ప్రవీణ్ ఒప్పుకోలేదు. గత రెండేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే ఉబర్ క్యాబ్ వాడానని చెప్పుకొచ్చాడు.ఈ విషయంపై డ్రైవర్ ఉబర్ కస్టమర్ కేర్ను సంప్రదించగా మొత్తం బిల్లు అతని నుంచి వసూలు చేయాలని, చెల్లించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.పోలీసు అధికారులు ఉబర్ కస్టమర్ కేర్ను సంప్రదించి ప్రవీణ్ నుంచి రూ.103 మాత్రమే వసూలు చేశారు. అనంతరం ఉబర్కు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ సాంకేతికలోపం తలెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుందని.. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. ఉబర్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేశామని చెప్పారు.