తూర్పు గోదావరి : కోనసీమ రైల్వే లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగి 18 ఏళ్లవుతోంది. బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడు అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ రైల్వే లైన్ కి శంకుస్థాపన అయితే చేశారు. పునాది రాయి పడింది కానీ అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కోనసీమ ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ రైల్వే లైన్ ఏర్పాటైతే వివిధ ఉత్పత్తుల రవాణాకు రైలు మార్గం తోడ్పడుతుందని అంతా ఆశించారు. అయితే కోనసీమ రైల్వే లైన్కు పలు బడ్జెట్ లలో కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.ప్రతి ఒక్కరి ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఉండే ఈ అంశం ఆ తరువాత చిత్తశుద్ధి లోపించి మాయమౌతోంది.
కాకినాడ నుంచి కోటిపల్లి
మరోవైపు కాకినాడ నుంచి కోటిపల్లి వరకు వేసిన రైల్వే లైన్ ఎందుకు పనికి రాకుండా పోతోంది. కోటిపల్లి నుంచి ఆ లైన్ పొడిగిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంతా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ రెండు బడ్జెట్ లలో కోటిపల్లి వద్ద గోదావరిపై వంతెన నిర్మాణానికి నిధులు సాధించినట్లు ఎంపీ పండుల రవీంద్రబాబు జోరుగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఆచరణలో ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. ఇప్పుడు టెండర్ల వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వం కోట్ చేసిన రేటు కన్నా ఏకంగా 150 కోట్లకు అదనంగా టెండర్లు నమోదు కావడంతో అధికారులకు ఏమీ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ టెండర్లు పూర్తి చేసినా పనులు మొదలుపెట్టాలంటే వచ్చే వరదల సీజన్ తరువాతే సాధ్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇక టెండర్ల జాప్యం పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. ప్రభుత్వ పెద్దలే ఇలాంటి వ్యవహారాలను తెరపైకి తెస్తున్నారని కోనసీమ వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రైల్వే లైన్ విషయంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.