బంజారాహిల్స్, హైదరాబాద్: నేర రహిత హైదరాబాద్ను భావితరాలకు అందించేందుకు కమ్యూనిటీ పోలీస్ వ్యవస్థ కృషిచేస్తోందని సీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఫిలింనగర్లో రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరా లను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో కలిసి గురువారం ప్రారంభించారు. పోలీసులంటే సామాన్యులు భయపడకూదనీ.. నేరస్థుడు నేరం చేసేందుకు భయపడేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, పీస్ టీం అనేక విధాలుగా పోలీసింగ్లో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చి నగరంలో నేరం చేసి పారి పోతున్న వారే అధికంగా ఉన్నారని గుర్తు చేశారు.
వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాపారులు, బస్తీ, కాలనీ సంక్షేమసంఘాలు సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలను అందజేస్తున్నాయని పేర్కొన్నారు. నేరస్థులను పట్టుకోవడంలో.. శిక్షపడటంలో కెమెరాలు దోహదపడతాయని వివరించారు.నగరంలో ఉన్న అన్ని కెమెరాలను అను సంధానిస్తూ కమాండ్ కంట్రోల్ నిర్మాణం చేపడుతున్నామని సీపీ చెప్పారు. నగరంలో నేరాలు తగ్గాయి : ఎంపీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ.. నగరంలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసింగ్లో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు.భద్రతకోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. నేరాలను అరికట్టేందుకు మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పరుచూరిగోపాలకృష్ణ మాట్లాడుతూ..చిన్నతనంలో పోలీసులను చూస్తే భయపడి పారిపోయేవాళ్లమని తెలిపారు. ఎమ్మెల్యే బాబుమోహన్, నిర్మాత సురే్షబాబు, కేఎస్ రామారావు, శివాజీరాజా, సురేష్, నరేష్, విజయ్చందర్, ఫిలింనగర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, డీసీపీ వెంకటేశ్వర్రావు, ఏసీపీ మురళీ తదితరులు పాల్గొన్నారు