ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో దురదృష్టం వెంటాడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు గుజరాత్ లయన్స్తో రెండో సమరానికి సిద్ధమైంది. సీజన్లో ఏడు మ్యాచ్లాడిన గుజరాత్ రెండు విజయాలతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండగా సన్రైజర్స్తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో దిగాలుపడ్డ కోహ్లీసేన 5 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఇక అన్ని మ్యాచ్లు గెలిచినా ప్లేఆఫ్ చేరుకోవడం కష్టమే అని విశ్లేషకుల అభిప్రాయం. మిగిలిన మ్యాచ్ల్లో మిగతా జట్ల ప్రదర్శనను బట్టే కోహ్లీసేన భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ లయన్స్తో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి బెంగళూరుది.
బెంగళూరుదే పై చేయి
సీజన్లో తలపడ్డ తొలిమ్యాచ్లో బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ ఛేదించలేకపోయింది. ఈ రెండు జట్లు ఐపీఎల్లో నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు కోహ్లీసేనదే విజయం. ఆర్సీబీ ఆ మూడుసార్లు 180, 248, 213 స్కోర్లు చేసింది. ఆల్రౌండర్ డ్వేన్బ్రావో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో గుజరాత్ ఇర్ఫాన్ పఠాన్తో ఒప్పందం కుదుర్చుకొంది. అతడు ఈ మ్యాచ్లో ఆడేది సందేహమే. ప్రస్తుతం వూపుమీదున్న బ్రెండన్ మెక్కలమ్కు టీ20ల్లో బెంగళూరు స్పిన్నర్లు శామ్యూల్ బద్రీ (34 బంతుల్లో 26, 2 సార్లు ఔట్), చాహల్ (23 బంతుల్లో 20, 3 ఔట్లు)పై మంచి రికార్డు లేదు. ఈ మ్యాచ్లో బద్రీ ఆడకపోతే నేగీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.