దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరుగుతుండడంతో అంతే స్థాయిలో తమ లావాదేవీలను పెంచుకోవాలని ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 400 కోట్ల (4 బిలియన్) లావాదేవీలను జరిపేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. అటు మొబైల్ వాలెట్తో పాటు, ఈ-కామర్స్ పోర్టల్ను నిర్వహిస్తున్న పేటీఎం ద్వారా గతేడాది 150 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఈ ఏడాది పేటీఎం లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి సాధిస్తుందని, 4.5 బిలియన్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ద్వితీయ శ్రేణి, అంతకుమించిన నగరాల నుంచే లావాదేవీలు పెద్దమొత్తంలో జరుగుతున్నాయన్నారు. జయపుర, సోనిపట్, విజయవాడ, విశాఖపట్నం, దుర్గాపూర్ వంటి నగరాల్లో పేటీఎం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు.ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎంకు 21.8కోట్ల మంది మొబైల్ వాలెట్ యూజర్లు ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలవైపు ప్రజలు మొగ్గు చూపడంతో పేటీఎం వేగంగా విస్తరించిన సంగతి తెలిసిందే.