టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన తోటత్రిమూర్తులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని, ఎల్లో మీడియాకు తప్ప అన్ని వర్గాలకు ఆయన పాలన బాగా నచ్చిందని విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీలో తోటత్రిమూర్తులు చేరడం సంతోషంగా ఉందని అన్నారు. వందరోజుల్లో జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. అన్ని వ్యవస్థలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబేనని, భవిష్యత్ లో టీడీపీ ఉండదని, చరిత్రపుటల్లో నుంచి మాయం అవుతుందని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ కు నిలకడలేదని, సంబంధిత అంశాలపై అవగాహనలేని వ్యక్తి అని విమర్శించారు.