యోగి ఆదిత్యనాథ్ దేశంలో ఇప్పుడీ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నయోగి తాజాగా భూ భకాసులపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. మతం పేరుతో భూములను కబ్జా చేసే వారిపై ఉక్కుపాదం మోపనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా భూ మాఫియా వ్యతిరేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. మతం పేరుతో భూములను ఆక్రమించే ఒక్కరినీ కూడా వదిలి పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు యూపీ ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్నా భూకబ్జాలపై స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. యోగి తాజా నిర్ణయంతో భూ మాఫియా వణుకుతోంది.