ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. 15 ప్రభుత్వ సెలవులను రద్దుచేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ సెలవులన్నీ యూపీకి చెందిన ప్రముఖ నేతల వర్ధంతులు, జయంతులే కావడం విశేషం. గత బీఎస్పీ, ఎస్పీ ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర నేతల జయంతి, వర్ధంతులను సెలవు దినాలుగా ప్రకటించి ఆయా వర్గాల ప్రజలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నించాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 42 ప్రభుత్వ సెలవు దినాలు ఉంటే వాటిలో 17 ప్రముఖుల వర్ధంతులు, జయంతులే. మాజీ ప్రధాని చంద్రశేఖర్ జయంతి (ఏప్రిల్ 17), చౌదరి చరణ్ సింగ్ జయంతి (డిసెంబర్ 23), అంబేద్కర్ వర్ధంతి (డిసెంబర్ 6) తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి.