బహుముఖ ప్రజ్ఞాశాలి కె. విశ్వనాథ్ జాతీయ చలనచిత్ర రంగంలోనే అత్యున్నత పురస్కారం అందుకోవడంపై నటుడు కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై వినయంతో తాను అదృష్టవంతుడినని విశ్వనాథ్ చెప్పుకున్నారు గానీ... వాస్తవానికి ఆయనొక్కడే అదృష్టవంతుడు కాదు.. భారతీయులందరూ అదృష్టవంతులు’’.. అంటూ కమల్ పేర్కొన్నారు. ఎన్నో జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయనకు సరైన గౌరవం దక్కిందన్నారు. వీరిద్దరూ కలిసి చేసిన స్వాతిముత్యం, సాగరసంగమం వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేయగా... సాగరసంగమంలో కమల్ నటనకు ఉత్తమ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అందుకున్నారు. ఈ సినిమాతో ఆయనకు దక్కాల్సిన గుర్తింపు తనకు దక్కిందని కమల్ తెలిపారు. స్వాతిముత్యం సినిమా ఉత్తమ విదేశీ కేటగిరీలో ఆస్కార్ కు వెళ్లిన విషయం తెలిసిందే.