ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ బంగారంతో బ్యాంకు రుణాలు స్వాహ చేసిన 72 మందికి జైలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2017, 01:19 PM

 ఖాతాదారులు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై లక్షల్లో సొమ్మును స్వాహా చేసిన కేసులో గుంటూరు జిల్లా రేపల్లె కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందిన కేసులో 72 మంది నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సోమవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే…. భట్టిప్రోలు ఆంధ్రాబ్యాంక్‌లో బంగారం అప్రైజర్‌ పడవల నరసింహారావు, మేనేజర్‌ టి.కేశవశాస్త్రి , కొంతమంది ఖాతాదారులు కుమ్మక్కై నకిలీ బంగారంతో రూ.27,50,500 రుణం తీసుకున్నారు. ఈ బకాయి 2009 నాటికి వడ్డీతో కలిపి రూ.32,05,308లకు పెరిగింది.2009లో బ్యాంక్‌ మేనేజర్‌గా నీరజ బాధ్యతలు చేపట్టారు. అప్పటి ప్రభుత్వం రుణాలు మాఫీ చేయడంతో.. బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్నవారంతా తమ ఆభరణాలు తీసుకెళ్లాలని నీరజ నోటీసులు ఇచ్చారు. కొంతమంది ఖాతాదారులు తమ బంగారాన్ని తీసుకెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన నీరజ… తనఖా పెట్టిన బంగారాన్ని పరీక్షించి చూస్తే… అది నకిలీదని తేలింది. దీనిపై 2009 ఫిబ్రవరి 4న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.జయలక్ష్మి… నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.బంగారం అప్రైజర్‌ నరసింహారావు… 2005 నుంచి 2008 వరకు ఉన్న మేనేజర్‌ కేశవశాసి్త్ర, క్యాషియర్‌ ఎస్‌కె.పట్టాభిలతో కలసి దరఖాస్తులు పూర్తి చేశారు. వాటిపై రైతులతో సంతకాలు పెట్టించుకున్నారు. ఒక్కొక్కరికి రూ.25-75 వేలరుణాలు మంజూరు చేశారు. దానికిగాను నకిలీ బంగారాన్ని నరసింహారావే ఖాతాదారులకు అందచేసి… ఆ నగలనే రుణం కింద పెట్టుకున్నారు. ఖాతాదారులకు మాత్రం రుణాలను బట్టి పది నుండి 20 వేలు ఇచ్చి… బ్యాంక్‌ అధికారులు ముగ్గురూ 20 లక్షలు స్వాహా చేశారు. అనంతరం… తన నోటీసులకు ఖాతాదారులు స్పందించకపోవడంతో నీరజ ఒక ఖాతాదారుని బంగారాన్ని పరిశీలించగా… అది దొంగ బంగారమని తేలింది. దీంతో, చీఫ్‌ జోనల్‌ ఆఫీసర్‌ సూర్యనారాయణ మూర్తికి ఈ విషయాన్ని తెలిపారు. అధికారుల సమక్షంలో బంగారాన్ని పరిశీలించగా అంతా నకిలీ బంగారమని తేలింది. తదుపరి జోనల్‌ ఆఫీసర్‌ ఆదేశాల మేరకు భట్టిప్రోలు బ్యాంక్‌ అధికారులు 2009 ఫిబ్రవరి 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.మా చేతికి పది వేలే..! తమకు దొంగ బంగారం ఇచ్చింది అప్రైజర్‌ అని ఖాతాదారులు అంటున్నారు. ‘మాకు ఎంత రుణం ఇచ్చారో కూడా తెలియదు. మా చేతికి పదివేలు మాత్రమే ఇచ్చారు. మీకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా చూసుకుంటామని అప్పుడు బ్యాంక్‌ అధికారులు తెలిపారు. ఇప్పుడేమో వారు అడ్రస్‌ లేరు. అమాయకులమైన మమ్మల్ని జైలు పాల్జేశారు. బ్యాంక్‌ అధికారులను పూర్తిస్థాయిలో విచారించి వాస్తవాలను వెలికి తీసి ముమ్మల్ని రక్షించండి’ అని ఖాతాదారులు భోరున విలపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com