లఖ్నవూ: ఓ చిన్న అగ్నిప్రమాదం సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ను తలదించుకునేలా చేసింది. వివరాల్లోకెళితే.. ఉత్తర్ప్రదేశ్ ఇటావాలోని ములాయం నివాసంలో ఎలక్ట్రిక్ మీటర్లో గురువారం షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు వచ్చాయి. విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది అక్కడికి మంటలు అదుపు చేశారు. తర్వాత మీటర్ చెక్ చేయగా అది కేవలం 5 కిలోవాట్ల విద్యుత్ సరఫరా చేసే మీటర్ అని గుర్తించారు. కానీ ములాయం మాత్రం 40 కిలోవాట్ల విద్యుత్ వాడుతున్నట్లు తెలిసింది. కరెంటు బిల్లు కూడా 5 కిలోవాట్లకు మాత్రమే కడుతుండడంతో.. ఆయన రూ.4లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో విద్యుత్ సిబ్బంది పాత మీటర్ స్థానంలో 40 కిలోవాట్ల మీటర్ ఏర్పాటు చేశారు. బకాయి పడ్డ రూ.4లక్షలను నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.