ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ, గూడూరు మధ్య మరో లైను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2017, 12:08 AM

 -మూడో రైల్వే లైనుతో మహర్దశ


 -బడ్జెట్‌ రూ 200 కోట్లు కేటాయింపు


 -రాజధాని ప్రాంతానికి పెరగనున్న రైళ్ల కనెక్టివిటీ


దేశంలోనే అత్యంత కీలకమైన హౌరా-చెనై్న రైలు మార్గంలో మూడో లైను ఏర్పడనుంది. విజయవాడ - గూడూరు, విజయవాడ - దువ్వాడ మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ కీలకం కానుంది. ఈ మార్గంలో రైళ్ల రాకపోకల స్వరూపం మారిపోనుంది.


గుంటూరు,సూర్యప్రతినిధి:  నవ్యాంధ్ర రాజధాని ఈ ప్రాంతంలో రావడంతో రాజధానికి అనుసంధానంగా కొత్త రైల్వే లైన్లు, రైళ్ల కనెక్టివిటీ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా హౌరా - చెనై్న ప్రధాన రైలు మార్గంలో విజయవాడ- గూడూరు మధ్య మూడో లైను ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే ఈ ప్రతిపాదన ఉంది. ఈ మార్గంలో రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరుకు రవాణా రైళ్లు, ప్రయాణికుల రైళ్లకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసి కారిడార్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పట్టాలు ఎక్కనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడ మీదుగా దువ్వాడ నుంచి గూడూరు వరకు మూడో లైను మంజూరైనట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు. మూడో లైన్‌ ఏర్పాటైతే ఈ మార్గంలోని తెనాలి జంక్షన్‌ రైల్వే అభివృద్ధికి కీలకం కానుంది. పలు రైళ్లు తెనాలి మీదుగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడనుంది. దీంతో పాటు తెనాలి రైల్వే స్టేషనను ఆధునికీకరణ జాబితాలో కూడా రైల్వే శాఖ చేర్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల 


స్వరూపం మారిపోనుంది.ప్రస్తుతం విజయవాడ - గూడూరు మార్గంలో రెండు లైన్లు ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలుతో పాటు గూడ్సు రైళ్లు అధిక సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో రద్దీ కారణంగా రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో భవిష్యత్తులో రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి వీలుగా మూడో లైను ఏర్పాటు అవసరమని భావిసున్నారు. తెనాలి -విజయవాడ - గుంటూరును కలుపుతూ రాజధాని మీదుగా భవిష్యత్తులో కొత్త రైల్వే లైన్లు రానున్నాయి. రాజధానిని కలుపుతూ ఈ నగరాల మధ్య రైళ్ల కనెక్టివిటీ పెంచాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం తెనాలి - గుంటూరు - విజయవాడ మధ్య సర్కు్యలర్‌ రైళ్లు నడుస్తున్నాయి. 


తెనాలి - గుంటూరు మధ్య డబ్లింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో వైపు రాజధాని అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడల మధ్య కొత్త లైన ఏర్పడనుంది. తెనాలి మీదుగా ఉన్న హౌరా- చెనై్న ప్రధాన రైలు మార్గాన్ని రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేస్తే పెరిగే ప్రయాణ అవసరాలకు తగిన విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యతలో ఈ మార్గంలో హై స్పీడ్‌ రైళ్లతో పాటు బుల్లెట్‌ ట్రైన్లను నడిపే ప్రతిపాదనను రైల్వే పరిశీలిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆయా మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com