అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. విజయవాడలోని గేట్వే హోటల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి అన్నారు. అలాగే ప్రాక్టికల్స్లో తొలిసారి జంబ్లింగ్ విధానం అమలు చేశామన్నారు. రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. గత ఏడాది ఏప్రిల్ 20న ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయగా, ఈసారి అంతకన్నా వారం రోజులు ముందుగా విడుదల చేశారు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు.