కర్ణాటక శాసనసభలో రేపు జరుగనున్న విశ్వాస పరీక్ష సందర్భంగా జారీ చేసిన మూడు లైన్ల విప్ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలకు వర్తించదని వారి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పారు. సుప్రీంకోర్టు రెండు ముఖ్యమైన అంశాలను తన తీర్పులో చెప్పిందని ఆయన అన్నారు. 15 మంది ఎమ్మెల్యేలను శాసనసభకు హాజరు కావాలని బలవంతం చేయలేరని సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన అన్నారు. శాసనసభకు హాజరు కావాలా వద్దా అనే విషయాన్ని రెబల్ ఎమ్మెల్యేల ఇష్టానికి వదిలివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఆయన అన్నారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు తగినంత సమయం ఇచ్చిందని ఆయన అన్నారు.