విశాఖపట్నం,సూర్యప్రతినిధి: జిల్లాలో నోట్లరద్దు నాటి కష్టాలు పునరావృతమవుతున్నాయి. నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తున్న ఏటీఎంలు అడిగినంత నగదు ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో జిల్లా వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 1,104 ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో కేవలం 10శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే 5% ఏటీఎంలు ఏజెన్సీలో ఉండటంతో నగరవాసులు గగ్గోలుపెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఏటీఎం ముందు చూసిన నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తుండటంతో రోజుల తరబడి నగరవాసులు ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఇక నేరుగా విత్ డ్రాలపై బ్యాంకు అధికారులు ఆంక్షలు జారీచేస్తున్నారు. సొంత అకౌంట్లో ఉన్న నగదు ఇచ్చేందుకు తమ వద్ద క్యాష్ లేదంటూ చేతులెత్తేస్తున్నారు. అవసరాలకు చేతిలో డబ్బుల్లేక.. మండుటెండల్లో ఏటీఎంల చుట్టూ తిరగలేక బ్యాంకుల్లో సరిపోయేంత నగదు ఇవ్వక తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఖాతాదారులు గగ్గోలుపెడుతున్నారు.