( వెలగపూడి-సూర్య ప్రధాన ప్రతినిధి ):ఆంధ్రప్రదేశ్లో ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుని తీరుతామని అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. శుక్రవారం ఉదయం సచివాలయంలోని అయిదో బ్లాక్లో అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా మంత్రి శిద్ధా రాఘవ రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడానికి కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు. ఇందుకోసం రెడ్ శాండిల్ తరలింపును అడ్డుకోడానికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు తో చర్చించి, భవిష్యత్తులో చేపట్టబోయే చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. తనకు మూడు శాఖలు అప్పగించడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూస్తామన్నారు. అటవీశాఖలో సంస్కరణలు చేపట్టి, పనితీరు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వన సంపద పరిరక్షణకు పటిష్ఠచర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాల ఫైల్ పై తొలి సంతకం చేసినట్లు మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. అంతకు ముందు తన ఛాంబర్లో వేద పండితుల సమక్షంలో పూజలు నిర్వహించారు. అనంతరం వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి శిద్ధా రాఘవరావుకు అభినందనలు తెలిపారు.