ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, రక్షణ రంగాల్లో మరో కీలక ముందడుగు పడింది. దేశ సముద్ర సాంకేతిక సామర్థ్యాలను గణనీయంగా పెంచే దిశగా నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద దేశంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది.శంకుస్థాపన కార్యక్రమానికి జువ్వలదిన్నె చేరుకున్న మంత్రి లోకేశ్ కు సాగర్ డిఫెన్స్ సంస్థ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించి, ప్రాజెక్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కూటమి ప్రభుత్వం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో 29.58 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో 7.58 ఎకరాల వాటర్ ఫ్రంట్ ల్యాండ్ కూడా ఉండటం విశేషం.మొదటి దశలో సాగర్ డిఫెన్స్ సంస్థ రూ.45 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్, అటానమస్ సిస్టమ్స్ డెవలప్మెంట్, మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధన-అభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఉపాధి లభిస్తుంది. 2026 నవంబర్ నాటికి ఈ కేంద్రంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును మొత్తం 200 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో బ్లూ ఎకానమీ, మారిటైం ఆవిష్కరణలు బలోపేతం కావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ను మారిటైం రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్గా నిలబెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం.అంతకుముందు, జిల్లాకు విచ్చేసిన మంత్రి నారా లోకేశ్ కు బోగోలు మండలం కప్పరాలతిప్ప వద్ద నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతి రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, పి.సునీల్ కుమార్, ఎన్.విజయశ్రీ, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు, సాగర్ డిఫెన్స్ సీఈవో కెప్టెన్ నికుంజ్ పరాశర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa