ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయేషా మీరా అస్థికలను తల్లిదండ్రులకు అప్పగించనున్న సీబీఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 06:55 AM

రెండు దశాబ్దాలుగా సంచలనం రేపుతున్న ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రీ-పోస్టుమార్టం నిమిత్తం సీబీఐ అధికారులు సేకరించిన ఆమె శరీర అవశేషాలను శుక్రవారం  తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. విజయవాడ సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు తెనాలిలోని ఖబర్‌స్తాన్‌లో అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటలోపు అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సీబీఐ అధికారులు గుంటూరు ఎస్పీని ఆదేశించారు. మరోవైపు, 19 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న ఆయేషా తల్లిదండ్రులకు మద్దతుగా న్యాయవాదులు, విద్యార్థి, మహిళా సంఘాలు 'చలో తెనాలి' కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. విజయవాడ నుంచి పెద్ద ఎత్తున తెనాలికి తరలిరానున్నారు.ఈ సందర్భంగా ఆయేషా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా మాట్లాడుతూ.. తమ కుమార్తె కేసులో సీబీఐ సహా అన్ని దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. "నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాకు అండగా నిలిచారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా మాకు న్యాయం చేస్తారని గట్టిగా నమ్ముతున్నాం" అని వారు తెలిపారు.త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లను కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరతామని చెప్పారు. ఆయేషా మరణించిన డిసెంబరు 27వ తేదీని 'సంస్మరణ దినం'గా ప్రకటించాలని, ఆమె పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అండగా నిలవాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa