చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై జరిగిన దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన సాగుతోందని, ఇది 'జంగిల్ రాజ్' కు నిదర్శనమని ధ్వజమెత్తారు.గతంలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తప్పని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ లు ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నివేదికలు నిర్ధారించాయని గుర్తుచేశారు. ఈ నిజాన్ని ప్రశ్నించినందుకే జీర్ణించుకోలేక అంబటి, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయించి నిప్పు పెట్టించారని ఆరోపించారు. "ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి" అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఈ దాడులు ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటల వేడి, చంద్రబాబు సర్కారును దహించివేయక మానదని జగన్ హెచ్చరించారు. రానున్న కాలంలో ప్రజాగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసి, ప్రభుత్వాన్ని బూడిద చేస్తాయని అన్నారు. "చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే. హింసా జ్వాలలను రగిల్చే చేయి కాలక తప్పదు, అరాచక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన ‘జంగిల్ రాజ్’ భూస్థాపితం కావడం ఖాయం" అని జగన్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa