వచ్చే జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఈ స్థానాల్లో ఒకటి తెలుగుదేశం పార్టీకి ఉండగా, మిగిలిన మూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అయితే, ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న బలబలాలను బట్టి చూస్తే, ఈ నాలుగు స్థానాలు ఏకపక్షంగా అధికార కూటమికే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాల సమయంలో లేదా ఆ తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
కూటమిలోని పార్టీల మధ్య ఈ సీట్ల పంపకం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పొత్తు ధర్మంలో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒక సీటును భారతీయ జనతా పార్టీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ స్థాయిలో ఉన్న సంబంధాల దృష్ట్యా బీజేపీ ఒక స్థానాన్ని ఆశిస్తుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల కేంద్రంతో సమన్వయం మరింత మెరుగుపడుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు.
మరోవైపు జనసేన పార్టీకి రాజ్యసభ సీటు కేటాయింపుపై పవన్ కళ్యాణ్ నిర్ణయం కీలకం కానుంది. జనసేన గనుక రాజ్యసభ స్థానాన్ని కోరితే, వారికి ఒక సీటు ఇచ్చి, మిగిలిన రెండు స్థానాలను టీడీపీ తన అభ్యర్థులతో భర్తీ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే, పార్టీలో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న సీనియర్లు చాలా మంది ఈ రేసులో ఉండటంతో, చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలు, విధేయత ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో శాసనమండలి (MLC) ఎన్నికల అంశం కూడా తెరపైకి వస్తోంది. కౌన్సిల్లో ఖాళీ అయ్యే స్థానాల్లో జనసేన తమ వాటా అడిగితే, రాజ్యసభ సీటు విషయంలో సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన ఎమ్మెల్సీ సీట్లపైనే మొగ్గు చూపితే, రాజ్యసభ సీటును వదులుకోవాల్సి రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి జూన్ నాటికి ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లే ఆ నలుగురు నేతలు ఎవరన్నది అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠను రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa