దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కూటమి పార్టీల్లోని కొందరు కోవర్టులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా ఏలూరులో నిర్వహించిన టీడీపీ ఏలూరు పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకరోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చితమనేని ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఏలూరు జిల్లాలో కూటమి పార్టీల్లో కోవర్టులు ఉన్నారని, వారి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చని ఆరోపించారు.
అలాంటి వారితో తాము ఇబ్బందులు పాలవుతున్నామని చింతమనేని ఆవేదన వ్యక్తం చేశారు. కోవర్టుల వల్ల టీడీపీలో దీర్ఘకాలం నుంచి ఉన్న కార్యకర్తలు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను వదలకుండా పట్టుకుని, అనేక కేసులను ఎదుర్కొన్న వారు.. నేడు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు కూటమి పార్టీల్లో చేరారని.. కనుక అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరేవారిపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని.. అలాంటి వారిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఏదో ఒక నియోజకవర్గంలో జరిగిన విషయాన్ని జిల్లా మొత్తానికి ఆపాదించడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని కొలుసు పార్థసారథి అభిప్రాయపడ్డారు.
చింతమనేని ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఆయన సొంత నియోజకవర్గం దెందులూరును ఉద్దేశించినవే అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం జడ్పీ ఛైర్పర్సన్గా ఉన్న పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు గతంలో వైసీపీలో ఉండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరు తెదేపాలో చేరారు. అయితే, జడ్పీ ఛైర్పర్సన్ దంపతులకు, చింతమనేనికి మధ్య విభేదాలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు. చింతమనేని వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. దీనిపై మిగతా పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa