ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిగి వచ్చిన కోడి గుడ్డు ధర.. మళ్లీ పాత ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 15, 2026, 08:12 PM

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కోడిగుడ్డు ధర కొండెక్కింది. ఒక్కో గుడ్డు ధర రూ. 8కి చేరింది. దీంతో చికెన్, గుడ్లు తినాలంటేనే జనాలు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో సంక్రాంతి వేళ కోడిగుడ్ల ధర ఒక్కసారిగా దిగిరావడం ప్రజలకు ఊరట కలిగిస్తోంది. నిన్నటి వరకు రూ. 8 పలికిన కోడిగుడ్డు ధర, రెండు రూపాయలు తగ్గి రూ. 6కి చేరింది. ధర దిగి రావడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా, పౌల్ట్రీ యజమానులు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు మరికొన్నాళ్ల పాటు ఉంటే లాభాలు వచ్చేవని వారు చెబుతున్నారు.


తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత నెలలో రికార్డు స్థాయికి చేరిన ధర, ఇప్పుడు గణనీయంగా తగ్గడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వంద గుడ్ల హోల్ సేల్ ధర రూ. 775 నుంచి రూ. 575కి పడిపోయింది. రిటైల్ ధర విషయానికి వస్తే ఒక్కో గుడ్డు మీద రూ. 2 తగ్గడంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ పౌల్ట్రీ యజమానుల ఆశలు అడియాశలయ్యాయి.


గత కొన్ని రోజులుగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడం, చలికాలంలో గుడ్డు వినియోగం అధికమవడంతో డిసెంబర్ 22 నాటికి ధర గరిష్ట స్థాయికి చేరింది. అయితే, జనవరి నుంచి పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కోల్‌కతా, అసోం, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలకు గుడ్లు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి పెరగడంతో ఎగుమతులు తగ్గి ధర పడిపోయిందని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.


"గుడ్డు ధర పెరిగి మంచి లాభాలు వస్తున్నాయన్న ఆనందం ఎంతో కాలం లేకుండా పోయింది. ఒక్క నెల మాత్రమే ధర బాగుంది. ఇదే ధర మరో రెండు నెలలు ఉంటే బాగుండేది. లాభాల బాట పడుతున్న రైతులు ఒక్కసారిగా మళ్లీ నష్టాల్లోకి పోయారు. చలికి పెద్ద కోళ్లు, పిల్ల కోళ్లు చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోయాం. ఎగుమతులు తగ్గడంతోనే ధర తగ్గిపోయింది," అని ఎలమంచిలికి చెందిన పౌల్ట్రీ రైతు పాపారెడ్డి తెలిపారు.


ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 21 లక్షల కోళ్లు గుడ్లు పెడుతున్నాయి. రోజుకు దాదాపు 20 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో కోడికి సగటున రూ. 370 ఖర్చు అవుతుండగా, ఏడాదిలో ఒక కోడి సుమారు 340 గుడ్లు పెడుతుంది. రైతుకు ఒక్కో గుడ్డుకు సగటున రూ. 5.10 ఖర్చు అవుతుంటే, ప్రస్తుతం రూ. 5.75 ధర లభిస్తోంది. అయితే, చిల్లర మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర ఇంకా రూ. 7 వరకు పలుకుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa