సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకున్న సీఎం.. ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రకటించారు. గురువారం (జనవరి 15) నారావారిపల్లెలోని సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. పండుగ సందర్భంగా పెద్దలను స్మరించుకోవడం, ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతిలో భాగమని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే.. సంపదకు విలువ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంపద పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకే తాము పీ4కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. దాదాపు 10 లక్షల మందిని ఈ విధానం కిందకు తీసుకొచ్చామన్నారు. కాగా, తిసుకునే ఆహారం, తాగునీరు, ఆలోచనల్లోనే.. ఆరోగ్యం ఉంటుందని తెలిపారు చంద్రబాబు. అందుకే ఈ ఏడాది రాష్ట్రమంతటా సంజీవని ప్రాజెక్టును అమలు చేసి.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య రికార్డులు తయారు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంతో పాటు.. సోలార్ విద్యుత్ను మరింత ప్రోత్సహిస్తామని, అన్ని పంపుసెట్లకు 'కుసుం' పథకం కింద సోలార్ పరికరాలు అందిస్తామని తెలిపారు.
ఏంటీ సంజీవని ప్రాజెక్టు .. ?
రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమాను అందించడానికి ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ పథకం ద్పారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఆరోగ్య బీమా కల్పించేలా.. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపొందించారు. సంజీవని పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద ఉన్న ఆసుపత్రుల్లో ఫ్రీగా వైద్య సేవలు పొందొచ్చు. కాగా, దాదాపు 3,250 చికిత్సలు ఈ విధానంగా ద్వారా ఉచితంగా లభిస్తాయి.
సంజీవని పథకం కింద ప్రజలకు రూ. 2.50 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయి. అందుకోసం ప్రజల తరుఫున ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. కాగా వైద్య చికిత్స ఖర్చు రూ. 2.5 లక్షలు దాటితే.. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందిస్తారు. చాలా వరకు చికిత్సలకు అయ్యే ఖర్చు రెండున్నర లక్షల లోపే ఉండటంతో.. ప్రభుత్వం పథకాన్ని ఇలా రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ సంజీవని ప్రాజెక్టును మొదటగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అనంతరం అనంతరం ఇటీవల చిత్తూరు జిల్లాలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తాజాగా రాష్ట్రమంతటా ఈ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa