రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేని, పారదర్శకమైన పాలన అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తీర్చిదిద్ది, 'జీరో ఎర్రర్ రెవెన్యూ సిస్టమ్' ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.10,169 కోట్ల ఆదాయం సాధించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారని మంత్రి పేర్కొన్నారు. "అవినీతి, అక్రమాలను పూర్తిగా నిర్మూలించేందుకు పాస్పోర్ట్ ఆఫీసుల మాదిరిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను మార్చాలని సీఎం సూచించారు. వెబ్ ల్యాండ్లో చేసే ఏ మార్పు అయినా శాశ్వతంగా ఆన్లైన్లో నమోదయ్యే వ్యవస్థను అమలు చేస్తున్నాం" అని ఆయన వివరించారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్లే రెవెన్యూ సమస్యలు పెరిగాయని అనగాని విమర్శించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ను బాధ్యునిగా నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. "రాష్ట్రంలోని 26 జిల్లాల్లో భూ సమస్యల పరిష్కార బాధ్యత ఇకపై జాయింట్ కలెక్టర్లదే. 7,600 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేశాం. 22ఏ, ఫ్రీ హోల్డ్ వంటి సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం" అని మంత్రి స్పష్టం చేశారు. పెండింగ్ అంశాలపై చర్చించేందుకు గురువారం మంత్రుల ఉపసంఘం సమావేశం కానుందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa