ఐదో తరగతి చదివే బాలుడు.. మహా అయితే పది, పన్నెండేళ్లు ఉండొచ్చు.. ఆడుతూ పాడుతూ తిరిగే వయసు.. ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే పరుగులు తీసే వయసు. కానీ అత్యవసర పరిస్థితి తలెత్తితే ఆ పిల్లాడు భయపడలేదు. అదరలేదు, బెదరలేదు.. కన్న తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. అమ్మను కాపాడుకున్నాడు.. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల చదువులకు సంబంధించిన వివరాలను ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు వివరించారు.
ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలోనే పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. జొన్నలగరువు ప్రభుత్వ పాఠశాలలో దీక్షిత్ అనే చిన్నారి ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే దీక్షిత్ వాళ్లమ్మ పేరెంట్ టీచర్ మీటింగ్కు రాలేదు. దీంతో తల్లి ఎందుకు ఇంకా మీటింగ్ రాలేదంటూ దీక్షిత్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి చూశాడు. అప్పుడే వాళ్లమ్మ కరెంట్ షాక్ తగిలి కొట్టుమిట్టాడుతున్న విషయం చూశాడు. అయితే ఈ ఘటన చూసిన దీక్షిత్.. భయపడిపోలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు.
భయంతో ఇరుగు పొరుగు వారిని పిలుచుకుని వచ్చేంత సమయం లేదని దీక్షిత్ గ్రహించాడు. తెలివిగా ఆలోచించి.. కరెంట్ షాక్ కొట్టడానికి కారణమైన మోటార్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత తల్లిపై పడిన కరెంట్ తీగను కర్ర సాయంతో తొలగించి తల్లి ప్రాణాలను కాపాడాడు. అనంతరం తల్లిని వెంటబెట్టుకుని ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు ఆమెకు ప్రథమ చికిత్స అందించడంతో ఆమె కోలుకుంది. అనంతరం తల్లితో కలిసి దీక్షిత్ స్కూళ్లో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్కు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, ఉపాధ్యాయులు దీక్షిత్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. దీక్షిత్ చాకచక్యంగా వ్యవహరించి తన తల్లికి పునర్జన్మ ఇచ్చాడని ప్రశంసిస్తున్నారు,
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa