ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎట్టకేలకు ఏపీలో ఆ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 08:44 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణలో మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించగా.. ఇప్పుడు స్థానిక పోరు షురూ అయ్యింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. తెలంగాణలో అంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. మరి ఏపీలో ఏం ఎన్నికలు ఉన్నాయి అని ఆలోచిస్తున్నారా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కీలక ఎన్నికలు నిర్వహించబోతున్నారు. పైగా 15 సంవత్సరాల నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15 ఏండ్ల నిరీక్షణ తర్వాత ఫార్మసీ కౌన్సిల్‌కు ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫార్మసిస్టులు ఈ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఫార్మసీ కౌన్సిల్‌కు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినవే చివరి ఎన్నికలు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. రాజకీయ జోక్యం, కోర్టు కేసులు, వల్ల రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికలు నిలిచిపోయాయి. ఈక్రమంలో గత కొంత కాలంగాప్రభుత్వ ఫార్మసిస్టు అసోసియేషన్, ఇతర సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని పోరాటాలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో 60 వేల మంది ఫార్మసిస్టులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


డిసెంబర్ 4వ తేదీ నుంచి ఓటర్లకు.. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను.. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపుతారు. ఫార్మసిస్టులు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి, డిసెంబర్ 24వ తేదీ నాటికి ఎన్నికల నిర్వహణ కమిటీకి వాటిని తిరిగి పంపించాలి. డిసెంబర్ 26, లేదా 27 తేదీల్లో ఓట్లను లెక్కిస్తారు. అత్యధిక ఓట్లు సాధించిన ఆరుగురిని సభ్యులుగా ఎన్నుకుంటారు. ఫార్మసీ కౌన్సిల్ ‌లో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఆరుగురిని ఎన్నుకుంటే.. మరో ఐదుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితో పాటు డీఎంఈ, డీహెచ్, ప్రభుత్వ అనలిస్ట్, డ్రగ్స్ డీజీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఈ 15 మంది సభ్యులు కలిసి ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు.


ఇంతకాలం ఫార్మసీ కౌన్సిల్ కార్యకలాపాలన్నీ.. కౌన్సిల్ రిజిస్ట్రార్ ద్వారానే నిర్వహించారు. దీనివల్ల ఫార్మసీ రంగంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొత్త కౌన్సిల్ ఏర్పడితే పరిపాలన మెరుగుపడుతుందని ఫార్మసిస్టులు ఆశిస్తున్నారు. ఎన్నికల కోసం పోరాడిన 'రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్' కొందరు అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ ఎన్నికలు ఫార్మసీ రంగంలో పారదర్శకతను, మెరుగైన పాలనను తీసుకువస్తాయని ఫార్మసిస్టులు ఆశిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa